Menu Close

మనం తినే ఆహారమే మన ఆలోచనలను అదుపు చేస్తాయి – Importance of Food in Telugu


Importance of Food in Telugu

ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి మనుగడకీ గాలీ, నీరూ, ఆహారం అవసరం. గాలీ, నీరూ అన్ని జీవులకీ సహజంగా లభించేవే. ఇక ఆహార విషయానికి వస్తే మనిషి తప్ప మిగతా జంతుజాలంలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క నిర్దేశిత ఆహారమంటూ ఉంది. కాని మనిషి మాత్రం భిన్నరుచులతో విభిన్న ఆహార పదార్థాలను సేవిస్తుంటాడు. ఈ ఆహారమే మనిషి యొక్క శారీరక ఎదుగుదలతో పాటు మానసిక పరిపక్వతకు తోడ్పడుతుంది. మనిషి తీసుకునే ఆహారాన్ని బట్టి అతనిలోని మానసిక గుణాలు అభివృద్ది చెందుతాయి.

Types of food – ఎలా అంటే ఆహారం మూడు రకాలు.1.సాత్వికాహారం, 2.రాజసాహారం, 3.తామసాహారం.

సాత్వికాహారం అంటే పండ్లూ,కాయగూరలూ మొదలైన శాకాహారం మనిషిలోని సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. రాజసాహారం అంటే అధికమైన ఉప్పూ, కారం, మసాలా దినుసులతో కూడిన మాంసాహారం రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది.ఇక తామసాహారం అంటే పులుపూ, నిల్వచేసిన పదార్థాలూ, రకరకాలైన మాంసాహారం తమోగుణాన్ని కలిగిస్తాయి.

నిర్వికారం, శాంతం, సహనం, క్షమ, భూతదయ, నిర్మోహత్వం, నిరహంకారం, అసూయ చెందకపోవడం సత్వగుణ లక్షణాలు.

కోరికలు, క్రోధం, మోహం, అహంకారం, అసూయ రజోగుణ లక్షణాలు.

కామం, దురాశ, కోపం, వ్యామోహం, గర్వం, అసూయ, నిద్ర, భయం, పిరికితనం తమోగుణ లక్షణాలు.

food

ఈ లక్షణాలు గల త్రిగుణాలకూ మూలమైన ఆహారంలో మూడు దోషాలు. 1.జాతి దోషం 2.గుణ దోషం 3.భావ దోషం

జాతిదోషం అంటే ఆహారాన్ని తయారు చేసేటప్పుడు పాటించని నియమాలవల్ల,అపరిశుభ్ర్రత వల్ల కలిగే దోషం గుణదోషం అంటే ఒక్కో ఆహారపదార్థానికీ ఒక్కో అనారోగ్యకరమైన దోషం ఉంటుంది. ఉష్ణం ( వేడి ), వాతం, కఫం, పైత్యం మొదలైనవి. భావదోషం అంటే ఆహారాన్ని వండేవారిలో ఉండే చెడ్డ భావాలవల్ల కలిగే దోషం.

జాతి దోషం కనిపెట్టవచ్చు. గుణదోషం తెలుసుకోగలం. కాని భావదోషమే మనకు తెలియదు. అలాంటి భావదోషం బారిన పడ్డ ఓ సన్యాసిని ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఓ సన్యాసి తన పర్యటనలో భాగంగా ఓ దేశసంచారం చేస్తూ ఆ దేశపు రాజుగారిని సందర్శించేడు.ఆ రాజుగారు సన్యాసికి సవినయంగా మ్రొక్కి స్వాగతం పలికి ఆ రోజు తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరేడు.సన్యాసి సరేనని అంగీకరించేడు.సన్యాసికి అతిథిగృహం ఇచ్చేరు.విందుభోజనం ఏర్పాటు చేసేరు.

సన్యాసి భోజనం చేసేక విశ్రాంతి తీసుకుంటూ ఆ గదిని పరిశీలించగా అందులో బంగారు,వెండి పాత్రలు సామగ్రి అలంకరించినట్లుగా పేర్చబడి ఉన్నాయి. హటాత్తుగా సన్యాసికి అనుకోకుండానే మనసులో ఒక దురాలోచన వచ్చింది.

“నేను నా జానెడు పొట్ట నింపుకోవడంకోసం ఇలా పర్యటనలు చేస్తూ, దేశసంచారం చేస్తూ ఇతరుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నానంటే భిక్షాటన చేస్తున్నట్లే కదా!ఎంత కాలం ఇలా? అదే ఇక్కడ ఉన్న బంగారు, వెండి పాత్రలలో దేనిని తీసుకుపోయినా కొన్నాళ్ళపాటు నా ఆహారానికి లోటు ఉండదు” అని అనిపించింది.

అదే తడవుగా ఆ రాత్రి గడిచేక తెల్లవారుజామున తన జోలెలో బంగారు, వెండి పాత్రలు వేసుకుని ఎవరికీ చెప్పకుండా బయలుదేరేడు. ఒకవేళ తాను ఎవరికంటనైనా పడినా సన్యాసిని కాబట్టి అనుమానించే ప్రసక్తే ఉండదనే ధీమాతో. ఊరి పొలిమేర దాటేడు. తెలతెలవారుతుంటే కాలకృత్యాలు తీర్చుకున్నాడు. వెంటనే తన తప్పు తెలిసొచ్చింది.

ఆలోచిస్తే తాను చేసిన పని ఏమిటీ తనలాంటివాడు చేయవలసిన పనేనా ఇది అని తన దుశ్చర్యకు తనను తానే తిట్టుకుని దానికి కారణం రాత్రి అతిథిగృహంలో తాను తిన్న ఆహారంలోని భావదోషమేనని గుర్తించి తిరిగి వెనక్కివెళ్లి రాజుగారికి జరిగినదంతా వివరించి అలా జరగడానికి కారణం వంటవాని భావదోషంగా చెప్పేడు.

విచారించగా తెలిసినదేమిటంటే ఆ రోజు వంటవాడు రాలేకపోవడాన్ని తాత్కాలికంగా మరొకనిని ఏర్పాటుచేయడం జరిగిందనీ ఆరా తీయగా వాడికి చోరగుణం ఉందనీ తెలిసింది. విన్నారు కదా ఆహారంలో భావదోష ప్రభావం ఎటువంటిదో!

Importance of Food in Telugu

పతి.మురళీధర శర్మ

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading