అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి – Telugu Moral Stories
ఓ మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి అసలు గురువు అవసరమా? గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి? అని ప్రశ్నించాడు.
గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు. అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు.

ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు. అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు.
ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా, తృప్తిగా మేసింది.
రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది. తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ, తిరుగుతూ వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.
ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు. రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.
గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి.
దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు.
పాపం! అందుకే వీడికి గురువు కావాలి. ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది. గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com