ఆలయం మొత్తం రంధ్రాలే, ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు – Brihadeeswara Temple Mysteries in Telugu
Brihadeeswara Temple Mysteries in Telugu: అత్యంత ప్రాచీన ఆలయాల్లో తంజావూరు బృహదీశ్వర ఆలయం ఒకటి. 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. ఇక్కడ అణవణువూ అంతుచిక్కని రహస్యమే..

తంజావూరులో ఉన్న 74 దేవాలయాల్లో శ్రీ బృహదేశ్వర ఆలయం అత్యద్భుతమైనది. మొత్తం గ్రానైట్ తో నిర్మించిన మొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. తంజావూరు పర్యటనకు వెళ్లేవారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయంలో గోడలపై సర్వ దేవతల విగ్రహాలు ఉంటాయి.
దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దగా కనిపిస్తాయి. వీరితో పాటూ అష్ట దిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. అష్ట దిక్పాలకులు కొలువైన అరుదైన దేవాలయాల్లో బృహదీశ్వరాలయం ఒకటి.
ద్రవిడ వాస్తు, శిల్ప కళా నైపుణ్యానికి నిలువుటద్దంలాంటి ఈ ఆలయంలో ఎత్తైన గోపురం, విశాలమైన కోటను తలపించే ప్రాంగణం, పెద్ద ప్రధాన ఆలయం, దాని చుట్టూ నిర్మించిన మందిరాలు అద్భుతంగా కనిపిస్తాయి. మొత్తం మూడు ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహరీ కోట గోడను తలపిస్తుంది.
రెండో ద్వారాన్ని కేరళాంతకన్ తిరువాల్ అని, మూడో ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అంటారు. వీటిలో కేరళాంతకన్ తిరువాల్ అనే ద్వారాన్ని రాజ రాజ చోళుని విజయ స్మారకంగా నిర్మించారు. ఈ ద్వారం దాటిన తర్వాత చెప్పులు విడిచి నడవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చే ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు పహరాగా ఉంటాయి. ఇక్కడి చెక్కిన ప్రతి శిల్పం వెనుకా ఓ పురాణ గాథ చెబుతారు. ఈ ద్వారం దాటిన తర్వాత పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. గర్భ గుడిలో శివ, శ్రీ విమాన మూర్తులను దర్శించుకోవచ్చు.
ఆలయం నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి..
- వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ కొత్తగానే కనిపిస్తుంది. దేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న శివాలయం కూడా ఇదే.
- ఈ ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంట్ వినియోగించలేదు..మొత్తం గ్రానైట్ రాయితోనే
- భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్థులు ఉన్న ఏకైక ఆధ్యాత్మిక క్షేత్రం బృహదేశ్వర ఆలయం.
- బృహదీశ్వర స్వామి శివలింగం ఎత్తు 3.7 మీటర్లు, నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు
- ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం విశేషేం
- ఆలయ గోపురం నీడ ఎక్కడా పడకపోవడం మరో విశేషం. చుట్టూ గుడి నీడ కనిపిస్తుంది కానీ గోపురం నీడమాత్రం కనిపించదు
- ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాల్లో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే
- ఆలయం వెలుపలి గోడలపై 81 రకాల భరతనాట్య భంగిమ శిల్పాలు ఉంటాయి.
- ఈ ఆలయానికి ఎన్నో రహస్య సొరంగ మార్గాలున్నాయి..ఇవన్నీ ఇతర ఆలయాలకు అనుసంధానించి ఉన్నాయని చెబుతారు
- ఈ ఆలయం ప్రత్యేకతల్లో మరో విశేషం ఏంటటే ఇక్కడి ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కన్నా ఎత్తుగా ఉంటాయి. దక్షిణ భారత ఆలయ నిర్మాణాలకు భిన్నమైన శైలి ఇది
తంజావూరు బృహదీశ్వరాలాయనాన్ని పూర్తిగా చూడాలంటే కనీసం రెండు గంటలైనా కేటాయించాలి. ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఆలయ సందర్శనకు వెళ్లడం మంచిది. ఎందుకంటే సీజన్ ఏదైనా తంజావూరు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది…మధ్యాహ్న సమయంలో ఆ వేడిని భరించడం కష్టమే. అదే సమయంలో ఇక్కడ వాన ఎప్పుడు పడుతుందో కూడా అంచనా వేయలేరు.
తిరుమల తిరుపతి – భక్తుల మనసు ఆకర్షించే దివ్య స్థలం – 10 Interesting Facts about Tirupati